పెళ్లైన తొలి రాత్రే భర్తపై దాడి చేసిన వధువు

25 Mar, 2021 14:22 IST|Sakshi

లక్నో: ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్న వరుడికి తొలిరాత్రే షాకిచ్చింది ఓ నూతన వధువు. గదిలోకి వెళ్లగానే ఐరన్‌ రాడుతో భర్త తల మీద మోది డబ్బు, నగలతో ఉడాయించింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యూపీలోని హరిద్వార్‌కు చెందిన యువతికి బింజోర్‌లోని కుండా ఖుర్ద్‌కు చెందిన యువకుడికి మార్చి 15న గుడిలో వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు తనతో ఏడడుగులు నడిచిన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. తనతో కలిసి కొత్త మజిలీ ప్రారంభించబోతున్నందుకు సంతోషంలో తేలియాడాడు. కానీ అతడి ఆనందం ఎంతో సేపు ఉండలేదు. అతడి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఫస్ట్‌నైట్‌ రోజే అసలు స్వరూపం బయటపెట్టింది నూతన వధువు.

గదిలోకి వెళ్లగానే కట్టుకున్న భర్త మీద ఐరన్‌ రాడితో దాడి చేసింది. దీంతో అతడు పెద్దగా కేకలు వేయగా.. బంధువులు గదిలోకి వచ్చేసరికి ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటన గురించి అతడు మాట్లాడుతూ.. "అసలేం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. నా భార్య ఆ రోజు సడన్‌గా నా మీద దాడి చేసింది. దీంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆమె బంగారు నగలతో పాటు రూ.20 వేలు తీసుకుని పారిపోయిందని తర్వాత తెలిసింది" అని చెప్పుకొచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కోసం గాలిస్తున్నారు. అలాగే ఈ పెళ్లి కుదిర్చిన పెళ్లిళ్ల పేరయ్య కోసం వెతుకుతున్నారు.

చదవండి: స్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది

మరిన్ని వార్తలు