లక్నో : తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందనే కోపంతో చెల్లిల్ని హత్య చేశారు అన్నలు. పోలీస్ స్టేషన్కు సమీపంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, పులియ గుజర్కు చెందిన అర్చన గత నెల 28న ఇంటినుంచి పారిపోయి మామ వరుసయ్యే దేవేంద్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి అర్చన కుటుంబసభ్యులకు ఏమాత్రం ఇష్టంలేదు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు దేవేంద్ర, అతడి ముగ్గురు తమ్ముళ్లపై దాతాగంజ్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు.
దీంతో దేవేంద్ర... భార్య అర్చన, తమ్ముడిని వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్కు బయలు దేరాడు. విషయం తెలుసుకున్న ఆమె ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు పోలీస్ స్టేషన్ సమీపంలో కాపుకాశారు. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ముగ్గురిపై దాడి చేశారు. ఈ దాడిలో అర్చన చనిపోయింది. దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్చన ఇద్దరు తమ్ముళ్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.