Hyderabad Student Suicide: అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

20 Feb, 2022 07:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీటెక్‌ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్‌ఐ అహ్మద్‌ పాషా తెలిపిన ప్రకారం.. శేరిలింగంపల్లిలోని దూబే కాలనీ రోడ్డు నెంబర్‌–11లో నివాసముంటున్న ఉమారాణి, వెంకటాచారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కుమ్మరి సౌజన్య (21) బాచుపల్లిలోని డీఆర్‌కే ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ చదువుతోంది. సౌజన్య గతంలో యూట్యూబ్‌ చానల్‌లో పనిచేస్తూ వీడియోలు తీస్తుండేది.

అందులో పనిచేస్తున్న విజయ్‌తో సన్నిహితంగా ఉండేవారు. శుక్రవారం తల్లి ఉమారాణి మొయినాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లగా ఆ రాత్రి ఇంట్లో సౌజన్య ఉరేసుకొంది. కాగా అదే సమయంలో విజయ్‌ సౌజన్యకు ఫోన్‌ చేయగా కాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అక్కడికి వచ్చి ఉరి వేసుకున్నది చూసి తాడు తెంచి వేశాడు. పక్క ఇంటిలో అద్దెకు ఉంటున్న సారంగపాణికి సమాచారం అందించి పారిపోయాడు.

సారంగపాణి చందానగర్‌ పోలీసులు, తల్లి ఉమారాణీకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే సౌజన్య మృతి చెంది ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌పై అనుమానంతో కుటుంబ సభ్యులు చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: (కుటుంబాన్ని కబళించిన ప్రేమ వివాహం) 

మరిన్ని వార్తలు