సిద్ధూ.. ఒక్కసారి చూడు బాబూ.. 

1 Jan, 2022 08:49 IST|Sakshi
సిద్ధూ(ఫైల్‌)

ఈతకు వెళ్లి మృతి చెందిన బీటెక్‌ విద్యార్థి, ప్రైవేటు ఉద్యోగి

వెంకటాచలం(నెల్లూరు జిల్లా): పెద్ద చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కన్న కొడుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు ఆదూరు శీనయ్య – అపర్ణ తల్లడిల్లిపోయారు. కందలపాడు సమీపంలో సాగునీటి కాలువలో ఈతకు వెళ్లి మృతిచెందిన మండలంలోని కనుపూరుకు చెందిన బీటెక్‌ విద్యార్థి ఆదూరు సిద్ధూ, తిరుపతికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి పర్నా అనుదీప్‌ మృతదేహాలకు శుక్రవారం ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో అనుదీప్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులు తిరుపతికి తీసుకెళ్లగా సిద్ధూ మృతదేహాన్ని బంధువులు శుక్రవారం 12 గంటలకు కనుపూరుకు తీసుకువచ్చారు.

చదవండి: రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి..

గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు 
కనుపూరు గ్రామానికి చెందిన ఆదూరు శీనయ్య – అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సిద్ధూ బీటెక్‌ చదువుతుండగా, రెండో కుమారుడు హర్ష నెల్లూరు నగరంలోని ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ తమ ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా చూడాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి వికటించి పెద్ద కుమారుడు సిద్ధూ మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. సిద్ధూ మృతదేహం ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల దుఃఖానికి అంతేలేదు. సిద్ధూ ఒక్కసారి నన్ను చూడు బాబూ.. అంటూ ఆ తల్లి పడిన ఆవేదన చూసిన వారిని కంటతడి పెట్టించింది.

ఎమ్మెల్యే కాకాణి పరామర్శ 
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆదూరు సిద్ధూ మృతిచెందాడని తెలియడంతో వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం కనుపూరుకు వెళ్లి సిద్ధూ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు