Jublee Hills Car Accident: ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం.. స్పందించిన బోధన్‌ ఎమ్మెల్యే

18 Mar, 2022 12:50 IST|Sakshi

మరో ముగ్గురికి తీవ్రగాయాలు.. వాహనంపై బోధన్‌ ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్‌ 

బంజారాహిల్స్‌: బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అభంశుభం తెలియని 2  నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన కాజల్‌ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే రోడ్డుపై బుడగలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో వారు వ్యాపారం ముగించుకుని జూబ్లీహిల్స్‌ వైపు వెళ్తుండగా.. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్‌ కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 వైపు అతివేగంగా వచ్చి వారిని ఢీకొంది.

ఈ ఘటనలో కాజల్‌ చౌహాన్‌ కుమారుడు అశ్వతోష్‌ (2 నెలలు) తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కాజల్, సారికా చౌహాన్, సుష్మా భోస్లేలను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు వెల్లడించారు.  
చదవండి: Hyderabad: ఈ రోజు రాత్రి ఆ మూడు ఫ్లైఓవర్లు మినహా అన్నీ బంద్‌ . ఎందుకంటే

అయితే ఈ ఘటనపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ స్పందించారు. ఈ ప్రమాదంతో తనకెలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే స్టికర్‌ను మిత్రుడు మీర్జా అనే వ్యక్తికి ఇచ్చినట్లు,అది అతనికి సంబందించిన కారని తెలిపారు. ఆ కారు ఓ ప్రైవేట్‌ ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద ఉందని అన్నారు. ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెట్టడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా విచారణ జరపాలని ఎమ్మెల్యే కోరారు.

మరిన్ని వార్తలు