కారులో మంటలు.. ఎన్సీపీ నేత సజీవ దహనం

14 Oct, 2020 19:53 IST|Sakshi
కారులో చెలరేగుతున్న మంటలు(ఫొటో కర్టెసీ: ఇండియా టుడే)

ముంబై: నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగిన ఘటనలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నేత, వ్యాపారవేత్త సంజయ్‌ షిండే దుర్మరణం చెందారు. డోర్లన్నీ లాక్‌ కావడంతో బయటపడే మార్గం లేక సాయం కోసం అర్థిస్తూ సజీవ దహనమయ్యారు. వివరాలు.. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న సంజయ్‌ షిండే ఎరువులు కొనుగోలు చేసేందుకు మంగళవారం సాయంత్రం పింప్లాగావ్‌కు బయల్దేరారు. ముంబై- ఆగ్రా హైవే గుండా ప్రయాణిస్తున్న సమయంలో షార్ట్‌ సర్య్యూట్‌ కారణంగా కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ అయిపోయింది. (చదవండి: ఒంటికి నిప్పంటించుకున్న వివాహిత)

దీంతో డోర్లన్నీ జామ్‌ అయిపోయాయి. అద్దాలు బద్దలుకొట్టుకుని బయటకు వచ్చేందుకు సంజయ్‌ షిండే ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఘటనాస్థలంలో ఉన్న స్థానికులు మాట్లాడుతూ.. కడ్వా నదిపై ఉన్న ఓవర్‌బ్రిడ్జి మీద మంటల్లో కాలిపోతున్న సమయంలో సాయం కోసం ఆయన కేకలు వేశారని, వెంటనే తాము అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినట్లు తెలిపారు. మంటలార్పేందుకు తాము ప్రయత్నించామని, అయితే అప్పటికే లోపల ఉన్న వ్యక్తి మృతి చెందారని పేర్కొన్నారు. కాగా నాసిక్‌ జిల్లాకు చెందిన సంజయ్‌ షిండే ద్రాక్ష పళ్లను ఎగుమతి చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఎన్సీపీలో చేరి రాజకీయ నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారు.

మరిన్ని వార్తలు