కుటుంబం విధివశం 

19 Jul, 2022 08:32 IST|Sakshi

సాక్షి, బళ్లారి: రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు–లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. సింధనూరు తాలూకా జవళగెరె సమీపంలోని బాలయ్య క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.  

బెంగళూరు నుంచి  హైదరాబాద్‌కు వెళ్తుండగా  
మధ్యప్రదేశ్‌కు చెందిన వారు బెంగళూరు నుంచి కారు (టీఎస్‌–08 హెచ్‌జీ–5584)లో హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఎదురుగా తెలంగాణ వైపు నుంచి సింధనూరు వైపు వస్తున్న లారీ (ఏపీ–21 వై–6498) ఢీకొంది. ఘటనా స్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా మరణించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా రోడ్డు రక్తమోడింది.

కారులోని నలుగురూ మరణించారు. మృతులు ప్రదీప్‌ (35), పూరి్ణమ (30), వీరి కూతుళ్లు జతిన్‌ (12), మాయిన్‌(7). స్థానిక సీఐ ఉమేష్‌ కాంబ్లె, బళగానూరు ఎస్‌ఐ వీరేష్‌ సిబ్బందితో లారీలోకి దూసుకుపోయిన కారును పొక్లెయినర్‌తో బయటకు లాగి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాల డ్రైవర్ల నిద్రమత్తే ప్రమాదానికి కారణమనే అనుమానం ఉంది. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. 

(చదవండి: సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు)

మరిన్ని వార్తలు