రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం 

21 Jan, 2023 01:21 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు  

భద్రాద్రి జిల్లాలో ఘటన.. లారీని ఢీకొట్టిన కారు  

ఇల్లెందు/ఇల్లెందు రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సమీపంలోని జెండాలవాగు వద్ద శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ప్రాథమిక సమాచారం మేరకు.. మృతులది హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండలంగా తెలుస్తోంది. వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్లుగా పని చేస్తున్న రాము, అరవింద్‌ ఏపీలోని చింతూరు మండలం మోతెలో జరిగే ఓ వెడ్డింగ్‌ షూట్‌లో పాల్గొనేందుకు కమలాపురం నుంచి కారు(టీఎస్‌ 03 ఎఫ్‌సీ 9075)లో బయల్దేరారు.

హన్మకొండలో స్నేహితులు రుషి, కల్యాణ్, రణధీర్‌ జత కలిశారు. ఐదుగురూ కలిసి మహబూబాబాద్‌ మీదుగా మోతె వెళ్తుండగా ఇల్లెందు సమీపాన జెండాలవాగు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. ముగ్గురు ప్రమాద స్థలిలోనే మరణించారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు కారులో గాయపడిన ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించారు.

108కు సమాచారం ఇచ్చి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఇల్లెందు ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన రణధీర్‌ను 11:30 గంటలకు ఖమ్మం తరలించారు. ఇతని పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాద స్థలిలో రెండు మృతదేహాలను పోలీసులు కట్టర్ల సాయంతో కారును కట్‌ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు