తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి

5 Sep, 2021 17:02 IST|Sakshi

ఓ వర్గంపై నంద్‌కుమార్‌ బాఘేల్‌ అనుచిత వ్యాఖ్యలు

చట్టం కన్నా ఎవరూ అధికం కాదన్న సీఎం భూఫేశ్‌ బాఘేల్‌

రాయ్‌పూర్‌: ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి తండ్రిపై కేసు నమోదైంది. తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ తండ్రి నంద్‌ కుమార్‌ బాఘేల్‌.
చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్‌ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక

బ్రాహ్మణులు విదేశీయులని, వారిని బహిష్కరించాలని ఇటీవల నంద్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, బ్రాహ్మాణులను గ్రామాల్లోకి రానివ్వొద్దని చెప్పినట్లు సర్వ్‌ బ్రాహ్మణ్‌ సమాజ్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని డీడీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్‌ కుమార్‌ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సంస్థ పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ఉన్నాయని చెబుతూ వాటి సాక్ష్యాలు కూడా అందించారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ సమాజం ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

తండ్రిపై కేసు నమోదు కావడంపై ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ స్పందించారు. ‘నా తండ్రివి, నావి రాజకీయ సిద్ధాంతం, నమ్మకాలు వేరు. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తా. కానీ ఒక ముఖ్యమంత్రిగా అతడి తప్పిదాలు, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలను క్షమించలేను’ అని పేర్కొన్నాడు. ‘మా నాన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడంతో నేను బాధపడ్డా. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు విఘాతం కలగడం సహించలేను’ అని భూపేశ్‌ పేర్కొన్నారు.  ‘చట్టం కన్నా ఎవరూ ఎక్కువ కాదు’ అని స్పష్టం చేశారు. అంటే పరోక్షంగా తన తండ్రిపై కేసు నమోదును సమర్ధించినట్లు కనిపిస్తోంది. నంద్‌ కుమార్‌ ఓబీసీలకు మద్దతుగా రాజకీయం చేస్తున్నారని ఆ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది.

చదవండి: తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం

మరిన్ని వార్తలు