టీటీడీపై దుష్ప్రచారం చేసిన 18 మందిపై కేసు

14 Aug, 2021 08:44 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారికి చెందిన 1,500 కిలోల బంగారు నగలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ, పండు బుద్దాల ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేలా కుట్ర పూరిత పోస్టులను పోస్టు చేశారు. మరో 16 మంది ఈ దుష్ప్రచారాన్ని తమ ట్విట్టర్‌ ఖాతాల నుంచి షేర్‌ చేశారు.

‘తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1,500 కిలోల బంగారాన్ని ఎస్‌బీఐలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం.. మమ్మల్ని తరువాత కాపాడండి. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. స్వామీ ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద’ అని టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారు. భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో వీరు ఈ దుష్ప్రచారం చేశారని విజిలెన్స్‌ అధికారులు ఆధారాలతో సహా తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు