సీఎం బంధువునంటూ బెదిరింపులు

22 Jul, 2022 04:34 IST|Sakshi
నిందితుడు సుబ్బారెడ్డి

నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

పొందూరు: బిల్డింగ్‌ కూల్చివేత విషయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, అతని తనయుడు తమ్మినేని చిరంజీవినాగ్‌తో పాటు ఇతరుల గురించి బెదిరింపు ధోరణిలో మాట్లాడిన వైఎస్సార్‌ కడప జిల్లా ప్రాద్దుటూరు మండలం తాలమాల్‌పురం గ్రామానికి చెందిన అన్నెపురెడ్డి చిన్న వెంకటసుబ్బారెడ్డిపై శ్రీకాకుళం జిల్లా పొందూరులో కేసు నమోదైంది. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాసుదేవరావు అనే వ్యక్తిపై కూడా దురుసుగా ప్రవర్తించాడని కూడా సుబ్బారెడ్డిపై ఫిర్యాదు వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను సీఎం బంధువునని, సీఎంఓ ఆఫీసులో ఉంటానని, బిల్డింగ్‌ కూల్చివేతకు సంబంధించి విచారణకు వచ్చానంటూ కొన్ని ఆడియో క్లిప్పింగులను వినిపించి మీ స్పీకర్‌ సంగతి, మీ నానిబాబు (చిరంజీవినాగ్‌) సంగతి చూస్తానంటూ సుబ్బారెడ్డి బెదిరించాడు. అలాగే.. ‘ఆర్డీఓ, ఈఓలతోను మాట్లాడాను, వారి ఉద్యోగాలు తీయిస్తా.. జైలు పాలవుతావు’ అని వాసుదేవరావును భయపెట్టాడు. దీంతో వాసుదేవరావు సీఎంఓ ఆఫీసుకు ఫోన్‌చేయగా అక్కడ అలాంటి వారెవరూ లేరని తేలింది.

అనంతరం వాసుదేవరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఐపీసీ 448, 418, 506 సెక్షన్ల కింద సుబ్బారెడ్డిపై కేసులు నమోదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా.. శ్రీకాకుళంలో రూం అద్దెకు తీసుకుని అక్కడే భూదందాలు, ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలుచేస్తున్నట్లు తేలింది. దీంతో అతనికి 41ఏ నోటీసు ఇచ్చి పంపించామని ఎస్‌ఐ ఎస్‌. లక్ష్మణరావు చెప్పారు. 

మరిన్ని వార్తలు