తన భార్య గోల్డ్‌ తాకట్టులో ఉందని.. మాజీ సీఎస్‌ను నమ్మించి..

3 Dec, 2022 12:53 IST|Sakshi

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): త్రిపుర రాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ ఉసురుపాటి వెంకటేశ్వర్లును మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం... మాజీ చీఫ్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు జూబ్లీహిల్స్‌లోని ప్రశాషన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు నానక్‌రాంగూడలో నివాసం ఉండే కొండ రవిగౌడ్‌ అనే వ్యక్తి కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయ్యాడు.

పరిచయం అయిన మొదటి రోజు నుంచి రవి గౌడ్‌ పూర్తిగా అతడిని నమ్మించాడు. అయితే తన భార్య గోల్డ్‌ తాకట్టులో ఉందని, దాన్ని విడిపించడం కోసం అర్జెంటుగా రూ. 21 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. 2020 జనవరి 21న తన కుమార్తె పుట్టిన రోజు ఉందని ఫంక్షన్‌ అవ్వాగానే  విడిపించిన బంగారాన్ని తిరిగి కుదువ బెట్టి, ఆ మొత్తాన్ని 3 నెలల్లో  తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు.

అతని మాటలు నమ్మి ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌ ద్వారా రూ. 21 లక్షలు అతని అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అప్పటి నుంచి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు ఫోన్‌ ద్వారా, వ్యక్తిగతంగా కలిసి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మోసపోయానని భావించిన వెంకటేశ్వర్లు రవిగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్‌.. నిందితులకు బెయిలిచ్చినా..  

మరిన్ని వార్తలు