వివాహితపై కన్నేసిన టీడీపీ నేతపై ‘దిశ’ కేసు 

21 Nov, 2020 09:59 IST|Sakshi

సాక్షి, డి.హీరేహాళ్‌ (రాయదుర్గం): వివాహితపై అసభ్యంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిపై దిశ చట్టం కింద కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డి.హీరేహాళ్‌ మండలం దొడగట్టకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసులు రౌడీషీటర్‌. ఇతను ఓ హత్య కేసులో ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.  (యరపతినేని నివాసాల్లో సీబీఐ దాడులు)

ఈ క్రమంలోనే శ్రీనివాసులు గ్రామంలోని ఓ వివాహితపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు. బుధవారం రాత్రి భర్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపైకి శ్రీనివాసులు రాళ్లు విసిరి వెకిలిచేష్టలు చేశాడు. వెంటనే ఆమె తన భర్తకు విషయం తెలిపింది. ఎవరక్కడ అని అరిచేసరికి అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. గురువారం బాధితురాలు తన భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. క్రైం నంబర్‌ 358 అండర్‌ సెక్షన్‌ 534డి, 509 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్‌ఐ వలిబాషా తెలిపారు.    (భార్య, కూతురుపై కన్ను.. వ్యక్తి దారుణ హత్య)

మరిన్ని వార్తలు