మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష

14 May, 2021 17:05 IST|Sakshi

ముంబై: కాలంతో పాటు మనం మారాలని అంటుంటారు. కానీ ఇంకా పలు గ్రామాల్లో పెద్దలుగా చెలామని అవుతున్న కొందరు వాళ్లు మారకపోవడమే గాక ఇతరులను తమ దారిలోనే నడవాలని అనుకుంటున్నారు. అదే తరహాలో ఇటీవల ఓ మ‌హిళ‌కు రెండో పెళ్లి చేసుకున్నందుకు గాను ఆ ప్రాంత కుల పెద్ద‌లు ఆమెకు దారుణ శిక్ష విధించారు. కుల పెద్ద‌ల ఉమ్మిని నాకాల‌ని ఆదేశించారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట అకోలా జిల్లాలో చోటు చేసుకుంది. అకోలా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌(35)కు 2011లో వివాహ‌మైంది. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా త‌న భ‌ర్త‌కు 2015లో విడాకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత 2019లో ఆమె రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన ‘నాథ్ జోగి’  పెద్ద‌లు అంగీకరించలేదు.

దీంతో ఆమె రెండో పెళ్లి గురించి మాట్లాడని ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోద‌రితో పాటు బంధువుల‌ను కుల పెద్ద‌లు పంచాయతీకి పిలిపించారు. రెండో పెళ్లి చేసుకోవడం తప్పని అందుకు శిక్ష అనుభవించాలని తెలిపారు. చేసిన తప్పుకు గాను..  కుల పెద్ద‌లంతా క‌లిసి అర‌టి ఆకుల‌పై ఉమ్మి వేస్తార‌ని, దాన్ని స‌ద‌రు మ‌హిళ నాకాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా రూ. ల‌క్ష జ‌రిమానా వేశారు. ఈ శిక్ష‌పై తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత మ‌హిళ‌.. నిన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.దీంతో ఈ కుల పెద్దల నిర్వాకం బయటపడింది. 

( చదవండి: నా దృష్టిలో నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు :సోనూసూద్‌ )

మరిన్ని వార్తలు