విద్యార్థిని ఆత్మహత్యకు.. ఆశ్రమ నిర్వాహకుడే కారణం: సీబీసీఐడీ

21 Jun, 2022 21:17 IST|Sakshi
మృతి చెందిన హేమమాలిని–  అరెస్టయిన మునస్వామి (ఫైల్‌)  

తిరువళ్లూరు: విద్యార్థిని ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామే కారణం అని.. సీబీసీఐడీ అధికారులు నిర్ధారించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చెంబేడు గ్రామానికి చెందిన హేమమాలిని(22) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యానికి గురికావడంతో బంధువులు 2021లో వెల్లాత్తుకోటలోని ఓ ఆశ్రమానికి ఆమెను తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి నాగదోషం ఉన్నట్లు నమ్మించి తరచూ యువతిని ఆశ్రమానికి రప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో యువతి బంధువులు ఆశ్రమానికి తీసు కెళ్లారు. రెండు రోజుల తరువాత హేమామాలిని అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత ఫలించక మృతి చెందింది. యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పలు సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మునస్వామిని మాత్రం అరెస్టు చేయలేదు.

ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీసీఐడీకి మార్చాలని ఆందోళనలు ఉద్ధృమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. కేసును విచారించిన సీబీసీఐడీ పోలీసులు యువతిపై ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి పలుమార్లు అత్యాచారం చేసాడని, తరచూ తనకు లొంగాలని యువతిని వేదించడం వల్లే మనస్థాపం చెంది హేమామాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమ నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.   

చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం)

మరిన్ని వార్తలు