రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం

29 Aug, 2020 03:32 IST|Sakshi

ముంబై: బాలీవుట్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్రవారం తొలిసారిగా సీబీఐ ముందు హాజరైంది. సీబీఐ ఆమెను 10 గంటలపాటు  విచారించింది. సుశాంత్‌ను ప్రియురాలు రియా మానసికంగా వేధించారని, అతని అకౌంట్ల నుంచి డబ్బు తీసుకున్నారని రాజ్‌పుత్‌ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 14వ తేదీన సుశాంత్‌ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. గురువారం రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని కూడా ప్రశ్నించిన సీబీఐ... ఇద్దరి వాంగ్మూలాల్లో తేడాలను పరిశీలించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రియాను సీబీఐ అడిగిన ప్రశ్నలిలా ఉన్నాయి.

► సుశాంత్‌ మరణం గురించి మీకెవరు చెప్పారు. అప్పుడు మీరెక్కడ ఉన్నారు.
► మరణవార్త తెలిసిన వెంటనే బాంద్రా ఫ్లాట్‌కు వెళ్లారా? లేకపోతే... ఎందుకు వెళ్లలేదు? ఎప్పుడు, ఎక్కడ సుశాంత్‌ మృతదేహాన్ని సందర్శించారు.
► అంతకుముందు వరకు కలిసి నివసించిన మీరు జూన్‌ 8వ తేదీన సుశాంత్‌ ఫ్లాట్‌ను వదిలి ఎందుకు వెళ్లారు?
► మీరు అలా వెళ్లిపోవడానికి ఏదైనా గొడవ కారణమా?
► వెళ్లిపోయిన తర్వాత జూన్‌ 9 – 14 మధ్యలో సుశాంత్‌తో మాట్లాడారా? ఏ విషయంపై మాట్లాడారు. ఒకవేళ మాట్లాడకపోతే ఎందుకు అతనితో కాంటాక్ట్‌లో లేరు?
► మరోవైపు సుశాంత్‌ ఈ రోజుల్లో మీకేమైనా కాల్స్, మెసేజ్‌లు చేశాడా? మీరు వాటిని పట్టించుకోలేదా? కాల్స్‌కు బదులివ్వకపోతే... ఎందుకలా చేశారు?
► సుశాంత్‌ ఆరోగ్య సమస్యలేమిటి? ఏ డాక్టర్లు, మానసిక నిపుణుల వద్ద చికిత్స తీసుకున్నాడు? ఏయే మందులు వాడుతుండేవాడు?  

మరిన్ని వార్తలు