Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు

4 Oct, 2021 18:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ దర్యాపప్తును సీసీఎస్‌ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నారు. అలానే అకాడమీలో పనిచేస్తున్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం విచారిస్తున్నారు పోలీసులు. కొన్ని డిపాజిట్లకు సంబంధించి సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు లభ్యం అయ్యాయి. 

ఈ క్రమంలో బ్యాంకులకు సోమిరెడ్డి ఇచ్చిన రిలీజింగ్ ఆర్డర్‌పై సీసీఎస్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అకాడమీ ఖాతాలో నిధులు డిపాజిట్ కాలేదని గుర్తించారు. ఈ వ్యవహారంలో మస్తాన్ వలీ, శ్రీనివాస్, సోమశేఖర్, రాజకుమార్‌ల పాత్రపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు పోలీసులు. వీరితో పాటు అకాడమీ మాజీ డైరెక్టర్ సత్యనారాయణను కూడా విచారిస్తామని తెలిపారు పోలీసులు. 
(చదవండి: ‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కొత్త కోణాలు! )

ఏపీ మర్కంటైల్ బ్రాంచ్ నుంచి డ్రా చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 64 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదంటున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారికి ఖాతాలో చిల్లిగవ్వ కూడా లేదని తెలిపారు. ఈ క్రమంలో నిధులు ఎవరికి చేరాయి అనేదానిపై పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. 64 కోట్ల రూపాయల నిధుల ఆచూకీ తెలుసుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు.  

చదవండి: సీసీఎస్‌ అదుపులో స్కామ్‌ సూత్రధారులు? 

మరిన్ని వార్తలు