క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌పై చార్జ్‌షీట్‌

28 Jan, 2021 17:27 IST|Sakshi

వారణాసి: టీమిండియా క్రికెటర్ శిఖర్‌ ధావన్‌పై చార్జ్‌షీట్‌పై గురువారం వారణాసి కోర్టులో​ చార్జ్‌షీట్‌ దాఖలైంది. దేశంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్‌ పక్షులకు ఆహారం వేయడం ఏంటంటూ సిద్దార్థ్‌ శ్రీవాత్సవ అనే లాయర్‌ అతనిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. లాయర్‌ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ త్రితియా దివాకర్‌ కుమార్‌ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు.

అసలు విషయంలోకి వెళితే... శిఖర్‌ ధావన్‌ గతవారం వారణాసి పర్యటనుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో  సరదాగా ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ధావన్ పేర్కొన్నాడు. ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో వారణాసి కలెక్టర్‌ స్పందించారు. ధావన్‌ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న తరుణంలో పక్షులకు మేత వేయడం నిశిద్ధం.అయితే బోటులో పక్షులకు ఆహారం వేసేందుకు పర్యాటకులను ఎలా అనుమతిస్తారని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. వీటిపై పర్యాటకులకు అవగాహన ఉండకపోవచ్చు.. బోటు యజమానులు విషయం చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు