ట్రేడింగ్‌ పేరుతో హాంఫట్‌ 

19 Aug, 2022 08:41 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సైబర్‌ నేరగాళ్లు వల వేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరి నుంచి లక్షల రూపాయిలు దండుకోగా..పర్సనల్‌ లోను పేరుతో మరో వ్యక్తి నుంచి లక్షలు కాజేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు గురువారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినర్‌కు చెందిన రోషన్‌అలీకి మూడేళ్ల క్రితం టాటాక్యాపిటల్‌ లోన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.

మీ ఫోన్‌నంబర్‌పై రూ.3లక్షలు పర్సనల్‌ లోన్‌ మంజూరు అయ్యిందన్నాడు. వివిధ కారణాలతో మొదట రూ.1లక్ష తీసుకున్నాడు. లోను అమౌంట్‌ పెరిగిందని ఆశ పెట్టి మూడేళల్లో పలు దఫాలుగా రూ.17లక్షలు కాజేశాడు. బోయినపల్లికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఓ హోటల్‌లో మేనేజర్‌గా చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్‌ రఘురాంని హాంగ్‌కాంగ్‌లో ఉండే వ్యక్తికి వాట్సప్‌ ద్వారా పరిచయం చేశాడు.

కొద్దిరోజులు ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకున్నారు. తాము ఒక కంపెనీలో ట్రేడింగ్‌ చేస్తున్నామని నువ్వు కూడా పెట్టాలని కోరారు. అతగాడి మాటలకు నమ్మిన రఘురాం ఎఫ్‌టీఎక్స్‌ అనే ట్రేడింగ్‌లో పలు దఫాలుగా రూ.40లక్షలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో ఆశ పెట్టి అతగాడి నుంచి రూ.7లక్షల 70వేలు దోచుకున్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ చెప్పారు.   

(చదవండి: మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్‌.. ఆ తర్వాత..)

మరిన్ని వార్తలు