చీటింగ్‌ కేసు: నాపై అన్యాయంగా కేసు నమోదు చేశారు

20 May, 2021 13:01 IST|Sakshi

చీటింగ్‌ కేసులో అరెస్టు అయిన జయంతి ఆరోపణ 

సాక్షి, హైదరాబాద్‌: రూ.100 కోట్ల విలువైన స్థలం అభివృద్ధి పేరుతో ఖాజాగూడ వాసి సింధూర రెడ్డిని నమ్మించి రూ.85 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో యాంకర్‌ శ్యామల భర్త లక్ష్మీ నర్సింహ్మారెడ్డితో పాటు అరెస్టు అయిన తిలక్‌నగర్‌ వాసి మట్ట జయంతి గౌడ్‌ గురువారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది.

అందులో జయంతి మాట్లాడుతూ... ‘నా తప్పు ఏమీ లేదు. అనుకోని పరిస్థితుల్లో రెండు నెలల క్రితం నర్సింహ్మారెడ్డి నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు ఓ అమ్మాయి నాకు కాల్‌ చేసి వేధిస్తోంది అని చెప్తే మాములుగా ఆమెకు కాల్‌ చేశాను. అప్పుడు ఆ అమ్మాయే నన్ను వేధించిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నర్సింహ్మారెడ్డిని తీసుకువెళ్లి రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో ఆ అమ్మాయిపై ఫిర్యాదు ఇప్పించా.. మా ఫిర్యాదును పక్కన పెట్టిన పోలీసులు అంతకు ముందు ఆ అమ్మాయి ఇతడిపై ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

ఆమె అనేక మంది నుంచి ఇలానే డబ్బులు తీసుకుంటోంది. నేను ఆమెకు రెండుసార్లు కాల్‌ చేస్తే ఆమె నాకు నాలుగు సార్లు కాల్‌ చేసింది. ఆమె బండారం బయటపడకుండా ఉండటానికి మాపై కేసు నమోదు చేయించింది. మాకు న్యాయం చేయకపోతే కమిషనర్‌ను కలుస్తానంటూ పోలీసుస్టేషన్‌లో చెప్పాను. దీంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. పోలీసులు ఆమె ఫిర్యాదులోని అంశాలపై దర్యాప్తు చేయకుండా నాపై చర్యలు తీసుకున్నారు’ అని ఆరోపించారు. అయితే జయంతి చేస్తున్న ఆరోపణలను రాయదుర్గం పోలీసులు ఖండిస్తున్నారు. సింధూర రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.

చదవండి: దారుణం: రూ.15 వేల కోసం.. అమ్మకానికి కూతురు

మరిన్ని వార్తలు