ఫొటోలు లీక్..ప్రియురాలు రౌద్రరూపం.. ప్రియుడు ఖతం 

20 Sep, 2022 09:53 IST|Sakshi

బొమ్మనహళ్లి: ప్రియుడు తన ప్రైవేటు ఫొటోలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడనే ఆగ్రహంతో ప్రియురాలు రౌద్రరూపం దాల్చింది. ముగ్గురు మగ స్నేహితులతో కలిసి ప్రియున్ని ఇష్టానుసారం కొట్టడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన బెంగళూరులో బేగూరు పరిధిలో చో­టు­చేసుకుంది. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

ఉక్రెయిన్‌లో చదివి వచ్చి  
వివరాలు... చెన్నై నగరానికి చెందిన వికాస్‌ (27), ప్రతిభ ప్రేయసీ ప్రియులు. ఉక్రెయిన్‌లో వైద్య కోర్సు చదివి వచ్చిన వికాస్‌ చెన్నైలో డాక్టర్‌గా పని చేసేవాడు. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైకో లేఔట్‌ వద్ద నివాసం ఉంటున్నాడు. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఒక ఆర్కిటెక్ట్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రతిభతో వికాస్‌కు రెండేళ్ల కిందట సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైంది. వికాస్‌ బెంగళూరుకు వచ్చాక అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకొన్నారు. నవంబర్‌ నెలలో పెళ్లి చేసుకుందామని జంట అనుకుంది.  

ఇన్‌ స్టాలో ఫొటోల పోస్టింగ్‌తో గొడవ  
ప్రతిభ నగ్న చిత్రాలను వికాస్‌ ఇన్‌ స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అది ఆమె కంటపడింది. దాంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్‌తో గొడవ పడ్డారు. ప్రేమించినవాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడని ప్రతిభ కుమిలిపోయింది. ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో గోడు చెప్పుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్‌ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టారు.

ఆ తరువాత వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకోకపోవడంతో సెయింట్‌ జాన్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితుడు ఆదివారం రాత్రి చనిపోయాడు. బేగూరు పొలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. 

(చదవండి: మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్‌ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు)

మరిన్ని వార్తలు