‘మెదక్‌ కారు డెత్‌’ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఆత్మహత్య

12 Sep, 2021 20:53 IST|Sakshi

కేపీహెచ్‌బీ కాలనీలో పిల్లల వైద్యుడు చంద్రశేఖర్‌ బలవన్మరణం 

మెదక్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన డా.ఆర్.చంద్రశేఖర్ మెదక్‌లో 20 ఏళ్లుగా అనురాధ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాడు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు శ్రీనివాస్ బంధువులు ఆరోపణలు చేశారు. ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండుకు తరలించారు.
చదవండి: నీట్‌ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి

ఆ కేసుపై భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో చంద్రశేఖర్ తన భార్యతో కలిసి వచ్చాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన అనంతరం భార్య తిరిగి మెదక్‌కి వెళ్లింది. చంద్రశేఖర్ కేపీహెచ్‌బీ కాలనీలోని సితార్ గ్రాండ్ హోటల్‌లో రూమ్‌ నం.314లో బస చేశాడు. గదిలోకి వెళ్లిన‌ అతడు ఎంతకు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌కు చేరుకొని గది తలుపులు తెరచిచూడగా చంద్రశేఖర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్‌

మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్ర శేఖర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో సర్జికల్ కత్తులు, స్లీపింగ్ పిల్స్ లభించాయని తెలిపారు. ఆయనపై మెదక్ కారు దగ్ధం శ్రీనివాస్ కేసులో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు