రెండేళ్లకే నూరేళ్లు నిండాయి 

20 Aug, 2021 02:37 IST|Sakshi

నాలుగో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి

మంచిర్యాల జిల్లాలో ఘటన 

మంచిర్యాలక్రైం: ఓ చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి వరండాలోని గ్రిల్స్‌పైకి ఎక్కి జారిపడి మృత్యుఒడికి చేరింది.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ‘మా విందుభోజనం’ హోటల్‌ యజమాని కొండబత్తుల ప్రవీణ్‌కుమార్, వాణి దంపతులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీసీ ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ రెసిడెన్సీ నాలుగో అంతస్తులో ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆయన్‌(5), కూతురు శాన్వి(23 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం కుటుంబసభ్యులు ఎవరి పనుల్లో వారు ఉండగా.. శాన్వి నిద్రలేచి వరండాలోకి వచ్చింది. రెసిడెన్సీ ముఖ ద్వారం వైపు వెళ్లి సిమెం టు గ్రిల్స్‌ పట్టుకుని కొంతదూరం పైకి ఎక్కింది. అక్కడ గ్రిల్స్‌ సందుల్లో నుంచి కిందికి చూస్తూ అదుపుతప్పి కింద పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

రెండో బర్త్‌డేకు ముందే మృత్యువాత 
శాన్వి 2019 సెప్టెంబర్‌ 9న జన్మించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న రెండో పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పుట్టినరోజు వేడుకలతో వెలిగిపోవాల్సిన ఆ ఇంట ఇప్పుడు చీకట్లు కమ్ముకున్నాయి. 

మరిన్ని వార్తలు