విజయనగరం జిల్లా నరవలో విషాదం
గంట్యాడ (గజపతినగరం): బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి మృతిచెందిన సంఘటన బుధవారం విజయనగరం జిల్లాలో విషాదం నింపింది. గంట్యాడ మండలం నరవలో గేదెల మనోజ్ (9), రొంగలి శేఖర్ (10), రొంగలి వాసు (8) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బహిర్భూమికి వెళ్లారు. సాయంత్రం పొలం పనుల నుంచి వచ్చిన వారి తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో వెదకసాగారు.
పిల్లలు చెరువు వైపు వెళ్లడం చూశామని గ్రామస్తుడొకరు చెప్పడంతో అనుమానం వచ్చి చెరువులో వెదికారు. పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని విగతజీవులుగా కనిపించారు. మనోజ్ది బుడతనాపల్లి. అతడి తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం విశాఖలో ఉంటున్నారు. ఇటీవల నరవలో ఒక వివాహానికి కుమారుడితో సహా వచ్చారు. గ్రామంలో కూలిపనులు దొరకడంతో ఇక్కడే ఉంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.