అయ్యో పాపం.. టీవీ మీద పడి చిన్నారి మృతి, బర్త్‌డేకు తెచ్చిన గౌను వేసి..

5 Sep, 2021 12:47 IST|Sakshi

సాక్షి, కృష్ణా(నందిగామ): మరో వారంలో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారిని ఇంట్లోని టీవీయే యమపాశమై కబళించింది. మండల పరిధిలోని కంచల గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరిలో చిన్న కుమార్తె చలమల కీర్తి (11 నెలలు) ఇంట్లో ఆడుకుంటూ టీవీ స్టాండ్‌ను తాకడంతో టీవీ చిన్నారిపై పడింది.

దీంతో పాప తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో బయట ఇంటి పనులు చేసుకుంటున్న తల్లి సౌందర్య లోపలికి వచ్చి బంధువుల సాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోనే చిన్నారి తుది శ్వాస విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కీర్తి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టిన రోజు వేడుక కోసమని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన గౌనునే.. ఆ చిన్నారికి ధరింపజేసి అంతిమ సంస్కారాన్ని నిర్వహించడం అందరినీ కంటతడి పెట్టించింది.

చదవండి: బెజవాడలో గోల్డ్‌ మాఫియా!

మరిన్ని వార్తలు