కారులో రూ.12 లక్షల చోరీ.. 24 గంటల్లో స్వాధీనం

12 Apr, 2021 12:37 IST|Sakshi

పుంగనూరు: కుమార్తె వివాహానికి బంగారు నగలు కొనేందుకు వెళుతున్న కుటుంబాన్ని దొంగల ముఠా వెంబడించి రూ.12 లక్షలు చోరీ చేసింది. 24 గంటల వ్యవధిలోనే పోలీసులు ఆదివారం దొంగలను పట్టుకుని కేసు  ఛేదించారు. పోలీసుల కథ నం మేరకు.. మదనపల్లెకు చెందిన ట్రాన్స్‌కో విశ్రాంత ఉద్యోగి మొహిద్దీన్‌ తన కుటుంబ సభ్యులతో కలసి తన కుమారై వివాహానికి నగలు కొనుగోలు చేసేందుకు శనివారం తమిళనాడులోని గుడియాతం పట్టణానికి కారులో సుమారు రూ.7 లక్షల నగదు, రూ.5 లక్షలు విలువ చేసే పాత బంగారు నగలు తీసుకుని బయలుదేరారు. మార్గం మధ్యంలో పుంగనూరు పట్టణంలోని బాలాజీ థియేటర్‌ వద్ద టిఫెన్‌ తినేందుకు కారును ఆపి, టిఫెన్‌కు వెళ్లారు. 

వీరిని వెంబడిస్తూ నెల్లూరుకు చెందిన ముఠా సభ్యులు పుంగనూరులో కారు ఆపగానే కారు డోర్లు పగులగొట్టి, డబ్బు, బంగారు నగలు ఉన్న బ్యాగును చోరీ చేశారు. ఈ విషయం గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల ముఠా డబ్బు తీసుకుని నెల్లూరుకు వెళుతున్నట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ సెంథిల్‌కు మార్‌ ఆదేశాల మేరకు నెల్లూరు పోలీసులను అప్రమత్తం చేశారు. నెల్లూరు పోలీసులు వాహనాన్ని, డబ్బు, నగల బ్యాగును స్వాధీనం చేసుకుని, నిందితులను పట్టుకుని పుంగనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

చదవండి: ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు!

మరిన్ని వార్తలు