-

ఎస్‌ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్‌ ద్వారా పరీక్ష రాసిన వైనం

27 Apr, 2022 10:30 IST|Sakshi

బనశంకరి: ఎస్‌ఐ పోస్టుల కుంభకోణంలో ఎన్‌వీ సునీల్‌కుమార్‌ అనే వ్యక్తిని సీఐడీ అరెస్ట్‌చేసి బెంగళూరుకు తీసుకువచ్చింది. ముఖ్య నిందితుడు రుద్రేగౌడ పాటిల్‌ ద్వారా బ్లూ టూత్‌లో సమాధానాలు విని సునీల్‌ పరీక్ష రాశాడు. దివ్యా హగరగి ఆధీనంలో ఉన్న కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్‌లో అతడు పరీక్షకు హాజరయ్యాడు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు.   

డీకేతో నిందితురాలి ఫోటో  
ఎస్‌ఐ స్కాంలో పరారీలో ఉన్న నిందితురాలు దివ్యా హగరగి కేపీసీసీ అద్యక్షుడు డీకే.శివకుమార్‌ తో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందాయి. ఆమె బీజేపీ నాయకురాలని, ఆమె ఇంటికి హోంమంత్రి జ్ఞానేంద్ర వెళ్లి సన్మానం పొందారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తుండగా, ఈ ఫోటోలు రావడం విశేషం.  

గెస్ట్‌ లెక్చరర్‌ విచారణ  
మరోవైపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మైసూరుకు చెందిన గెస్ట్‌ లెక్చరర్‌ సౌమ్యను బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం ఒకటవ ఏసీఎంఎం కోర్టులో ఆమెను హాజరుపరిచారు. గతనెల 14 తేదీన భూగోళ శాస్త్రం పరీక్ష రోజున ఉదయమే పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన సౌమ్య మొబైల్‌ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటోలు తీసుకుని  లీక్‌ చేసింది.

ఆమె వద్ద ఉన్న ప్రశ్నలు క్రమపద్ధతిలో లేనట్లు తెలిసింది. ఆమె మొబైల్‌ను తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేదానిపై విచారణ సాగుతోంది.  పేపర్‌ లీక్‌ స్కాంలో మైసూరు వర్సిటీలో జాగ్రఫీ గెస్ట్‌ లెక్చరర్‌ సౌమ్యా పైన కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్‌ శివప్ప మంగళవారం తెలిపారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

(చదవండి: హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్‌)

మరిన్ని వార్తలు