Ayyanna Patrudu: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న..

19 Jun, 2022 07:56 IST|Sakshi
డీసీపీ -1 గరుడ సుమిత్‌ సునీల్‌కు ఫిర్యాదు చేస్తున్న ఏయూ విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యోగులు

అయ్యన్నపాత్రుడిపై పోలీసులకు ఫిర్యాదు 

ఏయూ ప్రతిష్ట దిగజార్చేలా ట్విట్టర్లో పోస్టులు

డీసీపీ – 1 గరుడ సుమిత్‌సునీల్‌కు ఫిర్యాదు చేసిన ఏయూ విద్యార్థులు, ఉద్యోగులు

సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన ఏయూ ప్రతిష్టను దిగజార్చేవిధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలతో ట్విట్టర్‌లో పోస్టుచేసిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వారు నగర పోలీస్‌ కమిషనరేట్‌లో డీసీపీ – 1 గరుడ సుమిత్‌సునీల్‌కు ఫిర్యాదు లేఖ అందజేశారు.
చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు

గత 40 ఏళ్లగా ఏయూ పరిసర ప్రాంతాల్లో దట్టంగా తుప్పలు, చెట్లు, పొదలు ఉండడంతో అక్కడ ఆకతాయులు, అల్లరిమూకలు చేరి గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలు సేవించడానికి అనువైన ప్రదేశంగా మార్చుకుంటున్నారని.., అందుకే ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ఆ ప్రాంతాన్ని ‘నాడు – నేడు’ కార్యక్రమంలో భాగంగా నెల రోజులుగా శుభ్రం చేయిస్తున్నారని పేర్కొన్నారు. అసాంఘిక కార్యాకలాపాలకు అవకాశమిచ్చేలా ఉన్న పొదలు, తుప్పలను తొలగించి క్రీడా మైదానంగా తయారుచేస్తుంటే దానిపై విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఏయూపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు, ఉద్యోగుల్లో గ్రూప్‌లను సృష్టించి విధ్వంసకర వాతావరణాన్ని తీసుకొస్తున్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. ఏయూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ జీఎల్‌ఎస్‌ రవికుమార్, ప్రొఫెసర్లు షారోన్‌రాజు, పుల్లారావు, సుబ్బారావు, ప్రేమానంద్, ఎన్‌ఏడీ పాల్, గెస్ట్‌ ఫ్యాకెల్టీ తుల్లి చంద్రశేఖర్‌ యాదవ్, విద్యార్థి నాయకులు బి.కాంతారావు, చరణ్, పీతాన్‌ ప్రసాద్, పవన్, రాజుగౌడ్, ఆనంద్‌రత్నకుమార్, శ్యాంసుందర్‌రావు, కళ్యాణ్, ఎంప్లాయిస్‌ నాయకులు త్రినాథరెడ్డి, రమాణారెడ్డి, లక్ష్మణరెడ్డి, రాంబాబు, లా కాలేజ్‌ విద్యార్థులు తదితరులు ఫిర్యాదు అందజేశారు. 

మరిన్ని వార్తలు