ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

6 Oct, 2021 04:53 IST|Sakshi

యువకుడి కుటుంబ సభ్యులను బెదిరించి యువతిని తీసుకెళ్లిన బంధువులు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు

రామగుండం క్రైం(పెద్దపల్లి జిల్లా): ఓ యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడం రెండు కుటుంబాల మధ్య వివాదానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సీఎస్పీ కాలనీకి చెందిన శనిగరం సాయి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన శ్రీశాంకతో పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. దీంతో వారు ఈనెల ఒకటో తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి సాయి ఇంటికి చేరుకున్నారు.

అయితే మంగళవారం వేకువజామున శ్రీశాంక తల్లి, మేనమామ, ఇతర బంధువులైన తిలక్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌తో కలిసి వచ్చి సాయి కుటుంబ సభ్యులను కర్రలు, ఇతర మారణాయుధాలతో బెదిరించి శ్రీశాంకను తీసుకెళ్లారు. దీంతో సాయి కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు శ్రీశాంకను తీసుకువెళ్లిన కారు వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిఖని ఏసీపీ ఎస్‌.గిరిప్రసాద్, వన్‌టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌బాబు విచారణ చేపట్టారు. సాయికుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లితోపాటు, మేనమామలు, మరో నలుగురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, కిడ్నాప్‌ కేసు సైతం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు