సైదాబాద్‌ ఘటన దారుణం: కోమటిరెడ్డి

15 Sep, 2021 12:37 IST|Sakshi

హైదరాబాద్: సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్‌ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఘటన దారుణమని తెలిపారు. బాధిత కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, డమ్మీ హోమ్‌ మంత్రి పలకరించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కనిపించడం లేదనగానే.. పోలీసులు స్పందిస్తే అమ్మాయి బ్రతికి ఉండేదని అన్నారు.

పోలీసులున్నది గాడిదలు కాయడానికా అని ఘాటుగా విమర్శించారు. బాలిక మృతికి రాక్షసుడు ఎంత కారణమో.. పోలీసులు కూడా అంతే కారణమని అన్నారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దళిత, గిరిజన బిడ్డని కేసీఆర్‌ వివక్ష చూపిస్తున్నారా అని.. కోమటి రెడ్డి వెంటరెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసు శాఖకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు.. అవన్ని డబ్బులతో కొనుక్కుంటున్న అవార్డులని విమర్శించారు.

నిందితుడిని పట్టుకోవడంలో పోలీసుశాఖ అలసత్వం కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి సమయంలో ఒక కలెక్టర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు. మంత్రి తలసానికి సినీయాక్టర్‌ను పరామర్శించడానికి సమయం ఉంది కానీ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దిశ ఘటనలో చేసినట్లే ఈ ఘటనలోను నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. 

చదవండి: చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ

మరిన్ని వార్తలు