ఎక్సైజ్ కానిస్టేబుల్‌ బలవన్మరణం.. కారణం అదేనా?

6 Sep, 2021 10:45 IST|Sakshi

ఆరోగ్య సమస్యలున్నాసెంట్రీ విధులకు హాజరు

మనస్తాపంతోనే ఆత్మహత్య?

శంషాబాద్‌(హైదరాబాద్‌): రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ కార్యాలయంలో రాత్రి పూట రక్షణగా విధులు నిర్వర్తించడానికి వచ్చిన కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వికారాబాద్‌ జిల్లా ఎన్కతల గ్రామానికి చెందిన ఆశయ్య(48) చేవెళ్ల ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

శంషాబాద్‌ పట్టణంలోని జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ కార్యాలయంలో సెంట్రీ విధులు నిర్వర్తించడానికి ఆయా ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లకు రోజువారీగా కేటాయిస్తారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు డ్యూటీ నిమిత్తం ఆశయ్య శంషాబాద్‌ ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చాడు. సాయంత్రం ఉద్యోగులంతా వెళ్లిన తర్వాత ఒక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం మరో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ కార్యాలయానికి వచ్చే సరికి ఓ గదిలో ఆశయ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఆశయ్యకు అతిగా మద్యం తాగే అలవాటున్నట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి కూడా మద్యం తాగిన తర్వాతే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు అతడికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా గుండె ఆపరేషన్‌ చేసుకున్న తనకి సెంట్రీ విధులు వేయడంపై కూడా మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం.   మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్‌ డైలాగులు.. వాట్సాప్‌ స్టేటస్‌

మరిన్ని వార్తలు