వైద్యశాఖలో అవినీతి బాగోతం.. రిటైర్డ్‌ ఉద్యోగి నుంచి..

6 Aug, 2021 20:36 IST|Sakshi
సీనియర్‌ అసిస్టెంట్‌ కోరకంట శ్రీనివాస్‌

సాక్షి, నిర్మల్‌ (ఆదిలాబాద్‌): నిర్మల్‌ జిల్లాలో స్వల్ప వ్యవధిలోనే ఏసీబీ వలకు మరో అవినీతి జలగ చిక్కింది. వైద్యశాఖలో లంచాలకు అలవాటుపడ్డ ఉద్యోగి కథ బట్టబయలైంది. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యవిధాన పరిషత్‌ కార్యాలయంలో ఏసీబీ అధి కారులు గురువారం అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. లంచం తీసుకున్న సీనియర్‌ అసిస్టెంట్‌ కోరకంట శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాలు వెల్లడించారు. 

రిటైర్డ్‌ ఉద్యోగినీ వదలకుండా..
అటవీశాఖలో ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి(ఎఫ్‌ఎస్‌ఓ)గా పనిచేసిన జి.రాజేశ్వర్‌ 2018లో ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్‌ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్‌ రావాలంటే సమర్పించాల్సిన కమిటెడ్‌ వాల్యుయేషన్‌ రిపోర్ట్‌ కోసం జూలై 14న మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించారు. సదరు సర్టిఫికెట్‌ను ఖాళీ చేతులతో ఇవ్వడానికి సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ ముందుకు రాలేదు. రిటైర్డ్‌ అయిన తర్వాత నుంచి కనీసం పింఛన్‌ తీసుకోని రాజేశ్వర్‌ వద్ద రూ. పదివేలు లంచం అడిగాడు. చివరకు రూ.8వేల వరకు ఇస్తే ఓకే అన్నాడు.

దీంతో జూలై 26న రాజేశ్వర్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రూ.8వేలు లంచం తీసుకుంటున్న శ్రీనివాస్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కరీంనగర్‌ ఏసీబీ స్పెషల్‌ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు రావడంతో వైద్యవిధాన పరిషత్‌తో పాటు అదే భవనంలో ఉండే వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోనూ కలకలం కొనసాగింది. 

    

మరిన్ని వార్తలు