కౌన్సిలర్‌ కుమారుడి వీరంగం.. గ్యారేజీ యజమానితో గొడవపడి..

5 Apr, 2022 09:20 IST|Sakshi
ధ్వంసం అయిన కార్లు

సాక్షి,జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్‌ కుమారుడు సోమవారం సాయంత్రం వీరంగం సృష్టించాడు. తులసీనగర్‌ ప్రాంతంలో ప్రశాంత్‌ అనే వ్యక్తి కార్ల రిపేరు సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. రిపేరు కోసం వచ్చిన 11 కార్లను అక్కడ పార్కింగ్‌ చేసి ఉంచాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన అరుముల్ల నర్సమ్మ (25వ వార్డు కౌన్సిలర్‌) కుమారుడు అరుముల్ల పవన్‌.. సోమవారం గ్యారేజీ యజమాని ప్రశాంత్‌తో గొడవ పడ్డాడు.

తర్వాత ఆగ్రహంతో అక్కడే ఉన్న 11 కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. బాధితులు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. పవన్‌ అక్కడకు కూడా వెళ్లి ఫిర్యాదుదారులను భయాందోళనకు గురిచేశాడు. గ్యారేజీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్‌ తెలిపారు. కౌన్సిలర్‌ కుమారుడి తీరు కలకలం రేపింది.

మరో ఘటనలో..

వ్యక్తి అదృశ్యం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం గుల్లపేట గ్రామానికి చెందిన గాదం స్వామి (41) అదృశ్యమైనట్లు రూరల్‌ ఎస్సై అనిల్‌ తెలిపారు. స్వామి గతనెల 27న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. స్వామి భార్య విజయ సోమవారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

చదవండి: ‘కొడుకా.. ఎంత పని జేత్తివి బిడ్డా.. ’

మరిన్ని వార్తలు