కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!

29 Nov, 2020 08:17 IST|Sakshi

నిద్రిస్తుండగానే నలుగురిపై కత్తులతో దాడి 

ముగ్గురి మృతి.. బతికి బయటపడ్డ బాలుడు 

ఔరంగాబాద్‌లో కిరాతకుల క్రూరత్వం

సాక్షి, ముంబై: ఔరంగాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై నిద్రిస్తుండగానే దుండగులు కిరాతకంగా దాడిచేశారు. ఈ దాడిలో భార్య, భర్తలతోపాటు వారి తొమ్మిదేళ్ల కూతురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారి ఆరేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. మృతులను రాజు నివారే (శంభాజి) (35), అశ్వినీ నివారే, సాయలి నివారే (9)లుగా గుర్తించారు. గొంతు కోయడంతో ముగ్గురు మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటన జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేకేత్తించింది. పైఠన్‌ తాకాలూ పాత కావసన్‌ గ్రామంలో శనివారం  ఈ సంఘటన చోటుచేసుకుంది. 

నిద్రలోనే.. 
పైఠన్‌ సమీపంలోని కవసన్‌ గ్రామంలో రాజు నివారే, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. నివారే కుటుంబీకుల సన్నిహిత బంధువల పెళ్లి ఉండటంతో శుక్రవారం పెళ్లికి వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చి ఆలస్యంగా పడుకున్నారని తెలిసింది. పడుకున్న నివారే కుటుంబం సభ్యులపై శనివారం వేకువజామున  గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి పదునైన ఆయుధాలతో దాడులు చేశారు. అత్యంత పాశవికంగా కుటుంబసభ్యుల గొంతు కోసి పరారయ్యారు.   చదవండి: (రైతు ఇంట్లో ఐటీ దాడులు.. అపార సంపద) 

ఉదయం తలుపులు తీసి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి చూడగా నివారే కుటుంబం రక్తం మడుగులో కన్పించింది. రాజు నివారేతోపాటు ఆయన భార్య అశ్వినీ, కూతురు సాయలీలు అప్పటికే మృతి చెందారు. మరోవైపు రాజు నివారే కుమారుడు సోహమ్‌(6) తీవ్ర గాయాలతో కనిపించాడు. సోహమ్‌ను ఘాటిలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.  జిల్లా డిప్యూటీ సూపరిండెంట్, గోరక్ష్‌ భామరేలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.   

మరిన్ని వార్తలు