అప్పు.. అక్రమ సంబంధం.. ఓ హత్య

10 Feb, 2021 18:53 IST|Sakshi
నిందితులు ప్రీతి, వినోద్‌

లక్నో : వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. అప్పుకు బదులు మహిళతో సంబంధాన్ని కోరుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన వినోద్‌కుమార్‌, ప్రీతి దంపతులు ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన త్యాగి అనే వ్యక్తి దగ్గర ప్రీతి.. పెళ్లికి ముందు 40 వేల రూపాయలు అప్పు తీసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా దంపతులిద్దరూ కలిసి లక్ష రూపాయలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా అప్పు తీర్చకపోవటంతో ప్రీతిని తనతో సంబంధం పెట్టుకోమని త్యాగి బలవంతం చేశాడు. దీంతో గత సంవత్సరం నుంచి ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయం ప్రీతి భర్త వినోద్‌కు తెలియటంతో.. త్యాగిని చంపాలని నిర్ణయించుకున్నారు.  జనవరి 4వ తేదీన అతడ్ని విందుకు పిలిచి ఫుల్లుగా తాగించారు. ( పోలీస్‌ జీప్‌ను చూసి ఆ ఇ‍ద్దరు మహిళల పరుగులు..)

అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం శవాన్ని సూట్‌కేసులో పెట్టి విజయ్‌ నగర్‌లోని డ్రైనేజీ కాలువలో పడేశారు. స్నేహితుడి ఇంటికని వెళ్లిన త్యాగి మరుసటి రోజుకూడా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైనేజీలోని సూట్‌కేసులో కుళ్లిపోయిన స్థితిలో త్యాగి శవాన్ని గుర్తించారు. అతడి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, ఎటీఎమ్‌ విత్‌డ్రాల్స్‌, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరిపి ప్రీతి, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు