నటుడి పేరుతో ఫేస్‌బుక్‌లో నగదు మోసం 

29 Oct, 2021 07:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): టీవీ నటుడి పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతా ప్రారంభించి ఓ మహిళ వద్ద రూ.2.56 లక్షలు నగదును మోసం చేసిన కేసులో చెన్నైకి చెందిన దంపతులను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం పాప్పాపెట్టికి చెందిన బాలయ్య భార్య భాగ్యలక్ష్మి (26). ఈమె ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో టీవీ నటుడు అంటూ.. ఒకతను చేరాడు. వీరి మధ్య పరిచయం ఏర్పడి ఇద్దరూ అనేక మెసేజ్‌లు పంపుకున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో ఆ వ్యక్తి వైద్య ఖర్చుల కోసం తనకు అత్యవసరంగా రూ.2.56 లక్షలు కావాలని కోడంతో భాగ్యలక్ష్మి అతని అకౌంట్‌లో నగదు జమ చేశారు. తరువాత ఫేస్‌బుక్‌ మూలంగా పరిచయమైన అతనిని సంప్రదించగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో మోసపోయిన భాగ్యలక్ష్మి మదురై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందం పోలీసులు దర్యాప్తు చేయగా, టీవీ సీరియల్‌ నటుడు అని పరిచయం అయిన వారు చెన్నై తిరువొత్తియూరు, చిన్నమెట్టు పాలయంకు చెందిన సంతోష్‌రాజా అతని భార్య చిత్ర అని తెలిసింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.  

చదవండి: చిన్నారిని కిడ్నాప్‌ చేయించిన మేనమామ

>
మరిన్ని వార్తలు