పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య 

19 Dec, 2021 04:28 IST|Sakshi
మృతుడు హష్రు (ఫైల్‌) 

పెద్దకొత్తపల్లి: మతాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న భయంతో పురుగుల మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన షాలిమియా, ముంతాజ్‌ దంపతుల కుమారుడు హష్రు (26) పెద్దకొత్తపల్లిలోని మేనమామ రఫీక్‌ ఇంట్లో ఉంటూ స్థానికంగా లేడీస్‌ కార్నర్‌ నిర్వహిస్తున్నాడు.

రఫీక్‌ ఇంటి యజమాని కుమార్తె గోపిక (18)తో హష్రుకు పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో హష్రు మృతి చెందాడు. గోపిక నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు