రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి

6 Jun, 2021 06:52 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: తనకు రావాల్సిన రూ.300 కోసం కొరియర్‌ సంస్థకు ఫిర్యాదు చేసిందో యువతి. ఇదే అదునుగా భావించిన సదరు సంస్థ ప్రతినిధి యువతి వద్ద నుంచి రెండు దఫాలుగా రూ.1.90లక్షలు కాజేసి  ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో బంజారాహిల్స్‌కు చెందిన ఉషారాణి శనివారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... ఉషారాణి ఆన్‌లైన్‌లో ఒక ఐటెమ్‌ బుక్‌ చేసింది.

ఐటెంకు సంబంధించిన డబ్బు ఇచ్చాక,  కొరియర్‌ బాయ్‌ తిరిగి ఇవ్వాల్సిన రూ.300 ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో సదరు సంస్థ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసింది. సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఉషారాణికి ఒక అప్లికేషన్‌ను పంపి దానిని ఫిల్‌ చేసి తమకు ఆన్‌లైన్‌ ద్వారా పంపితే మీ డబ్బులు మీకు వస్తాయన్నారు.

అతను చెప్పినట్టు చేయగా... రూ.300 రాకపోగా ఆమె అకౌంట్‌ నుంచి తొలుత రూ.91వేలు కట్‌ అయ్యాయి. ఎందుకు ఇలా జరిగిందని మరోమారు అతనికి ఫోన్‌ చేయగా..మీరు తప్పుగా ఎంట్రీ చేశారు మళ్లీ ఫిల్‌ చేసి పంపండి.. ఇంకో అకౌంట్‌ నంబర్‌ ఇవ్వండన్నాడు. మరోసారి కూడా అలాగే పంపంగా, ఆ అకౌంట్‌ నుంచి కూడా రూ.99వేలు కాజేశాడు.
చదవండి: దారుణం: అడ్డుగా ఉందని చంపేశాడు
 

మరిన్ని వార్తలు