దోర్నాల్‌ తండాలో కరోనా కలకలం

28 Apr, 2021 10:28 IST|Sakshi

ధారూరు: వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలోని దోర్నాల్‌ తండాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేవలం 300 జనాభా ఉన్న ఆ చిన్న గ్రామం కరోనా పేరు వింటేనే వణికిపోతోంది. తండాకు చెందిన ఓ కుటుంబం రెండు వారాల కిందట కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన విందుకు వెళ్లి వచ్చింది. వారంరోజుల తర్వాత క్రమంగా ఆ కుటుంబంలోని వారందరూ అనారోగ్యం బారిన పడుతూ వచ్చారు. ఈక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి కరోనా టెస్టులు చేయగా.. విందుకు వెళ్లొచ్చిన వారి కుటుంబంలో 13 మందికి, తండాలోని మరో 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది.

వీరందరూ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. వీరిలో మంగళవారం ఉదయం రూప్లానాయక్‌ (101) మృతి చెందారు. ఈయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న తాండూర్‌లోని మహాసేవ యూత్‌ వెల్ఫేర్‌ సభ్యులు సయ్యద్‌ కమాల్, అక్తర్, సోహెల్, అహ్మద్‌ఉమ్రి, సాకిద్‌మీర్, తౌఫీక్, ఎండీ నజీర్‌ తండాకు చేరుకుని అంత్యక్రియలను పూర్తిచేశారు. 

కరోనా పాజిటివ్‌ రావడంతో ఆత్మహత్య 
గార్ల: కరోనా బారిన పడడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని కోట్యానాయక్‌తండాకు చెందిన బానోత్‌ శంకర్‌(45)కు ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇంటికి వెళ్లాక భయంతో పురుగుల మందు తాగాడు. శంకర్‌ను వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శంకర్‌ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.   

చదవండి: మాస్కు ధరించలేదని చిన్నారులతో 

మరిన్ని వార్తలు