గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్‌ 

4 Jun, 2022 22:58 IST|Sakshi
అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న సీఐ మోహన్‌రెడ్డి  

పీలేరు : నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. సీఐ ఎన్‌. మోహన్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సీఐకు అందిన సమాచారం మేరకు పోలీస్‌ సిబ్బందితో కలిసి శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద దాడి చేశారు. మదనపల్లెకు చెందిన సయ్యద్‌ సుల్తాన్‌ (28) గంజాయి కలిగి ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయితోపాటు ఒక ఫోన్, రూ. 400 స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెడు వ్యసనాలకు బానిసై అక్రమంగా డబ్బు సంపాదించాలని పలువురితో కలిసి గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. విశాఖపట్నం వెళ్లి అక్కడ పాడేరుకు చెందిన ఏ–3 నిందితుడు మహేష్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసి రైలులో అక్రమ రవాణా చేసి మదనపల్లెకు తీసుకుని వచ్చే వాడు.

చిన్న పొట్లాలుగా కట్టి విక్రయించే వాడు. అలాగే బెంగళూరుకు చెందిన ఏ–2 నిందితుడు ఖాజాకు గంజాయి పెద్దమొత్తంలో సరఫరా చేసే వాడు. సయ్యద్‌ సుల్తాన్‌పై మదనపల్లె–1 టౌన్, అలిపిరి, కర్ణాటక రాయపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో దోపిడీ, హత్యాయత్నం, హత్య లాంటి నేరారోపణలపై కేసులు ఉన్నాయి. మదనపల్లె–1 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ కేసు ఉంది. బెంగళూరుకు చెందిన ఖాజా, పాడేరులోని మహేష్‌ను అరెస్ట్‌ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు