రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత

15 May, 2022 23:27 IST|Sakshi

నలుగురు అరెస్టు 

చింతూరు: ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 530 కిలోల గంజాయిని శనివారం చింతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ యాదగిరి తమ సిబ్బందితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మోతుగూడెం వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా గుమ్మడికాయల కింద దాచి రవాణా చేస్తున్న గంజాయి లభ్యమైంది.

గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరవ్‌కుమార్, ప్రతాప్‌కుమార్, ఒడిశాకు చెందిన కొర్రా సన్యాసిరావు, కిలో అర్జున్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.   

మరిన్ని వార్తలు