రక్తమోడిన రామోజీపేట 

27 Oct, 2020 07:55 IST|Sakshi
రామోజీపేటలో బాధితురాలితో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

ఇరువర్గాల ఘర్షణ  9 మందికి గాయాలు 

9 ఇళ్లు, 11వాహనాలు ధ్వంసం.. ఉద్రిక్తత

సాక్షి, సిరిసిల్ల: దసరా పండుగ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో రక్తం చిందింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ఊరు రణరంగమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రామోజీపేటలో ఇరువర్గాల మధ్య చాలాకాలంగా వివాదాలు ఉన్నాయి. దసరా సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒక వర్గం వారు డీజే సౌండ్స్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తుండగా.. మరో వర్గం వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పరస్పర దాడులకు దిగారు. ఒక వర్గం వారు కర్రలతో దాడి చేసి ఏడుగురిని గాయపరిచారు. 9 ఇళ్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి దాడులు చేశారు.

11 వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రామోజీపేటకు చేరుకుని బాధితులను, సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఎస్పీ రాహుల్‌హెగ్డే, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ సర్వర్‌లు గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంవారు కర్రలతో మరో సామాజిక వర్గం వారిపై దాడి చేయడం ఆందోళన కలిగించింది.

మరిన్ని వార్తలు