స్వీట్‌ బాక్సులు పంచారు, వీధి మొత్తం దోచేశారు

3 Mar, 2021 10:37 IST|Sakshi
నిందితుడు పంచిన స్వీట్‌ బాక్సులు

స్వీట్‌గా దోచుకుపోయిన దంపతులు

లబోదిబోమంటున్న బాధితులు

సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): మూడు నెలల క్రితం ఓ ఇంట్లో అద్దెకు దిగిన దంపతులు ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారి డబ్బు దోచుకుని పరారవడంతో బాధితులంతా లబోదిబోమంటున్న ఉదంతమిది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మల్కన్‌గిరి జిల్లాకేంద్రంలోని బుట్టిగుడ వీధికి చెందిన ఉషా పటేల్‌ ఇంటికి  మూడు నెలల క్రితం సుభాష్‌ అనే వ్యక్తి భార్యతో వచ్చి ఇల్లు అద్దెకు అడిగాడు. ఇల్లు ఖాళీగా ఉండడంతో ఉషాపటేల్‌ వారికి అద్దెకు ఇచ్చింది. ఇంటిలో ఉంటున్న సుభాష్‌ సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి..తనకు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారందరికీ ముందుగానే మత్తుమందు కలిపిన  స్వీట్స్‌ పంచిపెట్టాడు.


                               ఇంటి యజమాని ఉషా పటేల్‌

ఆ స్వీట్స్‌ తిన్న వారందరూ ఓ గంటలో మత్తులోకి జారుకున్నారు.  రాత్రి పది గంటల సమయంలో భార్యతో కలిసి సుభాష్‌ యజమాని ఇంటిలో ఉన్న రూ.35 లక్షల విలువ చేసే బంగారం, రూ.2.5 లక్షల నగదుతో పాటు, చుట్టుపక్కల ఏడిళ్లలో చిన్నపాటిగా నగదు దోచుకుని భార్యతో సహా పరారయ్యాడు.  మంగళవారం ఉదయం యజమాని ఉషాపటేల్‌ లేచి చేసి మొత్తం ఆ దంపతులే దోచుకున్నారని గ్రహించి చుట్టుపక్కల వారిని పిలిచి లబోదిబోమంది. దీంతో ఇరుగుపొరుగు వారు కూడా తమ ఇళ్లలో కూడా దోచుకున్నట్లు గుర్తించి అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందిత భార్యాభర్తల కోసం గాలిస్తున్నారు.   

మరిన్ని వార్తలు