అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్‌ మృతి

25 Jan, 2021 09:22 IST|Sakshi

సాక్షి, కట్టంగూర్(నల్గొండ)‌ : అనుమానస్పద స్థితిలో ఫొటోగ్రాఫర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లారం పంచాయతీ పరిధి ఎస్‌ఎల్‌బీసీ కాల్వపక్కనే ఉన్న పెద్దవాగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టం గూర్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన మేకల హరికృష్ణ(23) ఈనెల 23న ఉదయం ఈదులూరు రోడ్డు వెంట ఉన్న ఫొటో స్టూడియో తీస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ద్విచక్రవాహనంపై వెళ్లాడు.సాయంత్రం వరకు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో వారు షాప్‌వద్దకు వెళ్లి చూసేసరికి ఓపెన్‌ చేసి ఉంది కానీ హరికృష్ణ లేడు. దీంతో బంధువులకు ఫోన్‌  చేసినా ఆచూకీ లభించలేదు.

కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. మల్లారం శివారులోని పెదవాగు సమీపంలో ద్విచక్రవాహనం ఉందని గ్రామస్తులు ఆదివారం తెలిపారు. అక్కడికి వెళ్లి చుట్టుపక్కల చూసి.. అటుగా వచ్చేవారిని వాకబు చేశారు. వాగుపక్కనే యువకుడు పడి ఉన్నాడని తెలుసుకుని.. అక్కడికి వెళ్లి చూడగా హరికృష్ణ విగతజీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరికృష్ణ అన్న హరిబాబు ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు