ఢిల్లీ గ్యాంగ్‌.. లక్షలు వసూల్‌! 

10 Jan, 2022 05:40 IST|Sakshi

ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం 8 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 

హిమాయత్‌నగర్‌: ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షలు దండుకుంటున్న ముఠా గుట్టు రట్టయ్యింది. అక్రమంగా కాల్‌ సెంటర్‌ నడుపుతూ దగాకు పాల్పడుతున్న ఢిల్లీ గ్యాంగ్‌ను సిటీ సైబర్‌క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు అమ్మాయిలు షైఫలీ, యోగిత, షాలుకుమారి, ప్రియ, శివానీ, ముగ్గురు అబ్బాయిలు రాజేష్‌సింగ్, అనుభవ్‌సింగ్, నఫీజ్‌ను ఢిల్లీలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ తెలిపారు. శనివారం సీసీఎస్‌ కార్యాలయంలో సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎన్‌ ప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
 
హైదర్‌గూడకు చెందిన యువతి ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం కావాలంటూ ‘షైన్‌ డాట్‌కామ్‌’లో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేసింది. రెజ్యూమ్‌ని చూసిన ఢిల్లీ గ్యాంగ్‌ యువతితో ఫోన్‌లో మాట్లాడారు. కంపెనీ నిబంధనలు చెప్పి యువతి నుంచి రూ. 8,02,426 వసూలు చేశారు. అయినా ఉద్యోగం రాలేదు. డబ్బులు అడిగినా వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితురాలు గత ఏడాది అక్టోబర్‌ 10న సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీరిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 26 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు