సాక్షి,జగద్గిరిగుట్ట(హైదరాబాద్): ఆన్లైన్ యాప్ ద్వారా నగదు ఇన్వెస్ట్ చేసిన మహిళ మోసపోయిన ఘటన స్థానిక పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గాజులరామారం ఉషోదయకాలనీ ఫేజ్–2కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆంజనేయులు భార్య శ్రీలక్ష్మి జూలై 26న ఫేస్బుక్లోని కున్డాంగ్ జాబ్ నిమిత్తం ఓపెన్ చేయగా అందులో ఉన్న 8006734868 ఫోన్ నంబరుకు కాల్ చేసింది.
సదరు వ్యక్తులు పంపిన లింక్ను ఓపెన్ చేసి సీషాప్ అనే యాప్ను ఆమె డౌన్లోడ్ చేసింది. మొదట రూ.100 ఇన్వెస్ట్ చేయగా రూ.238 ప్రాఫిట్ వచ్చింది. మరోసారి 3వేలు ఇన్వెస్ట్ చేయగా 4,800 లాభం వచ్చినట్లు చూపించారు. ఇలా డబ్బుపై ఆశ పెరగడంతో రూ.30వేలు ఒకసారి, 35,900 మరోసారి ఇలా మొత్తం 2,56,470 నగదును సదరు యాప్లో ఇన్వెస్ట్ చేసింది. అయితే అకౌంట్లో చూపించిన నగదు తీసుకోవడానికి వీలు కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గిఫ్ట్ పేరుతో బురిడీ..
జగద్గిరిగుట్ట: ఫేక్ ఫోన్ కాల్తో ఆన్లైన్ నగదు బదిలీ చేసిన ఓ యువతి మోసపోయిన ఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దీనబంధు కాలనీకి చెందిన ప్రియాంక ప్రైవేట్ ఉద్యోగి. జూలై 29న 9477815658 నెంబర్ నుండి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను అమెజాన్ సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీకు గిఫ్ట్ వచ్చిందని, రూ.5వేలు చెల్లిస్తే డెలివరీ చేస్తామని చెప్పాడు.
నమ్మిన ప్రియాంక సదరు వ్యక్తి చెప్పిన అకౌంట్కు 5వేల పంపింది. సదరు వ్యక్తి మరలా ఫోన్ చేసి జీఎస్టీ ఇష్యూస్ ఉన్నాయని రూ.9,999 పంపితే మరలా మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామని మాయమాటలు చెప్పడంతో మొత్తం 45వేలను ట్రాన్స్ఫర్ చేసింది. గిఫ్ట్ రాకపోగా ట్రాన్స్ఫర్ చేసిన నగదు సైతం వెనక్కి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బా«ధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.