ఉద్యోగం కోసం వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ పెట్టాడు.. కాసేపటికే..

21 Aug, 2021 07:59 IST|Sakshi

బాలానగర్‌: ఉద్యోగం కోసం నౌకరి డాట్‌ కామ్‌లో ప్రొఫైల్‌ పెడితే సైబర్‌ నేరగాళ్ల బారిన పడిన ఓ వ్యక్తి రూ.25,314లను పోగొట్టుకున్న సంఘటన బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహిదుద్దీన్‌ తెలిపిన వివరాలు.. ఆర సాయికుమార్‌ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఫోన్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం కోసం నౌకరిడాట్‌ కామ్‌లో ఈ నెల 19న తన ప్రొఫైల్‌ను పెట్టాడు.

అదే రోజు ఓ మహిళ హిందీలో మాట్లాడి నౌకరి డాట్‌ కామ్‌ నుంచి మాట్లాడుతున్నాని చెప్పింది. ఇంటర్వ్యూ గురించి 10 రూపాయలు పంపాలని లింక్‌ పంపిందిం. లింక్‌ ఓపెన్‌ చేసి అతని క్రెడిట్‌ కార్డు నుంచి డబ్బులు వేసేందుకు ప్రయత్నించినా 25,314 రూపాయలు డెబిట్‌ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించి సాయికుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

పార్సిల్‌ రాలేదని సెర్చ్‌ చేస్తే రూ.7 వేలు..  
సరైన సమయంలో పార్సిల్‌ రాలేదని ఓ వ్యక్తి ఆ పార్శిల్‌ సంస్థకు చెందిన కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి నగదు పోగొట్టుకున్న సంఘటన బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. మహమ్మద్‌ షరీఫ్‌ అనే వ్యక్తి బాలానగర్లో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏఆరస్సీ పార్శిల్‌ సంస్థ కస్టమర్‌ కేర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేయగా అందులో కనిపించిన ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయగా ఫోన్‌లో ఓ వ్యక్తి హిందీలో మాట్లాడి మీకు వేరే నెంబర్‌ నుంచి ఫోన్‌ వస్తుంది లిఫ్ట్‌ చేసి మట్లాడండి అని చెప్పాడు. వెంటనే ఫోన్‌ వచ్చింది పార్శిల్‌ వివరాలు కనుక్కొని పార్శిల్‌ను రిజిస్ట్రేషన్‌ చేయలేదు. నేను ఒక లింక్‌ పంపిస్తాను.

దాంట్లో పార్శిల్‌ వివరాలు నమోదు చేసి కేవలం 5 రూపాయలు పంపండి అని చెప్పాడు. ఆ లింక్‌లో బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్, యూజర్‌ నేమ్, పాస్‌వర్డు ఎంట్రీ చేసి 5 రూపాయలు పంపగా కొద్ది సేపటి తరువాత 7వేలు అతని అకౌంట్‌ నుంచి మాయం అయ్యాయి. మోసం గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు

మరిన్ని వార్తలు