స్పీడు పోస్టు రాలేదని సెర్చ్‌ చేస్తే.. రూ.7 లక్షలు స్వాహా

28 Mar, 2023 11:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): తనకు రావాల్సిన స్పీడు పోస్టు రాని కారణంగా సంబంధిత పోస్టల్‌ కస్టమర్‌ కేర్‌ కోసం ఓ మహిళ గూగుల్‌లో సెర్చ్‌ చేసింది. అంతే ఓ అగంతకుడు ఆమె వాట్సప్‌లోకి చొరబడ్డాడు. మాటలు కలిపి నమ్మించి నట్టేట ముంచాడు. లక్షల రూపాయిలు పోగొట్టుకున్న ఆ మహిళ తనకు న్యాయం చేయాలంటూ సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. పంజగుట్టలో నివాసం ఉండే మహిళకు సమీప బంధువులు ముఖ్యమైన సమచారాన్ని స్పీడు పోస్టు ద్వారా పంపారు.

అది ఆమె చేతికి అందకపోవడంతో పోస్టల్‌ అధికారులతో మాట్లాడేందుకు గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం సెర్చ్‌ చేసింది. ఓ వ్యక్తి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అంటూ వాట్సప్‌లో పలకరించాడు. కేవలం రూ.3 పంపితే మీ పోస్టు మీకు రిటర్న్‌ వస్తుందన్నాడు. మహిళ ఒప్పుకోవడంతో ఆమెకు ‘బేస్‌ డాట్‌ ఏపీకే’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి దానిలో వివరాలన్నీ నమోదు చేయించాడు. తర్వాత మరో లింకు పంపి ఆ లింకు ద్వారా అకౌంట్‌లోని రూ.7 లక్షల 25 వేలు స్వాహా చేశాడు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు