Hyderabad: మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కొంపముంచిన ‘చిత్రాలు’

20 Nov, 2022 20:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె పెయింటింగ్‌ చిత్రాలను కొనుగోలు చేస్తామంటూ  లక్షల రూపాయిలు కాజేశారు. దీంతో బాధితురాలు శనివారం సిటీ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. సోమాజిగూడలో నివాసం ఉండే ఆర్టిస్ట్‌ నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తోంది.

ఖాళీ టైంలో పెయింటింగ్‌ వేసి ఆ చిత్రాలను తన ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తుంటుంది. వీటిని చూసిన కేటుగాడు ఆమెతో మాట కలిపాడు. వాట్సప్‌ నంబర్‌ తీసుకుని చాట్‌ చేసి ఎన్‌ఎఫ్‌టీ ఇన్వెస్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ వైపు రప్పించాడు. ఈ వెబ్‌సైట్‌లో పెయింటింగ్స్‌ కొనేవారు చాలా మంది ఉన్నారని నమ్మించాడు.

తొలుత ఇన్వెస్ట్‌ చేస్తే  లక్షలు వస్తాయన్నాడు. తన పెయింటింగ్స్‌ అమ్ముడవ్వాలనే ఆశతో ఆర్టిస్ట్‌ అతగాడు చెప్పిన విధంగా కొంత డబ్బు ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత దాని లాభాల కోసం ట్యాక్స్‌లు, కమీషన్‌ అంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ.8లక్షలు కాజేశాడు. ఇంకా ఇంకా అడుగుతూ ఇబ్బంది పెడుతున్న క్రమంలో తాను మోసపోయానని గుర్తించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.
చదవండి: నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం!  

మరిన్ని వార్తలు