Hyderabad: మాటల్లో దించి.. మాయచేసి.. 

24 Sep, 2021 10:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాంకేతిక పెరిగేకొద్ది సైబర్‌ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్త ఎత్తుగడలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి నగదు కాజేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సైబర్‌ నేరగాళ్లు మాత్రం తమదైన శైలిలో దోచుకుంటున్నారు. బ్యాంక్‌ అధికారులు ఎప్పుడూ ఫోన్‌ చేయరని, అలాంటి ఫోన్లు వస్తే ఎలాంటి వివరాలు ఇవ్వరాదని సమీపంలోని స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి వాసులు సైబర్‌ వలకు చిక్కకుండా పోలీసులు, కాలనీ సంక్షేమ సభ్యులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

– బాలానగర్‌

మచ్చుకుకొన్ని..  లింక్‌ ఓపెన్‌ చేయడంతో..  
బాలానగర్‌ ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ చూడగా ‘మీ బ్యాంక్‌ అకౌంట్‌ 24 గంటల్లో డియాక్టివేట్‌ అవుతుంది’. వెంటనే మీ కేవైసీ డాక్యుమెంట్స్‌ను చేయాలని ఓ లింక్‌ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి బ్యాంక్‌ సీఆర్‌ఎం నంబర్, పాస్‌వర్డ్‌ ఎంట్రీ చేయగా ఆ వ్యక్తి అకౌంట్‌ నుంచి రూ.49,999 డెబిట్‌ అయ్యాయి. 

నౌకరీ.కామ్‌ పేరుతో.. 
27 ఏప్రిల్‌ 2021 రాత్రి 11.41 సమయంలో ఓ మహిళలకు గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి నౌకరీ.కామ్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాం. మీకు మంచి ఉద్యోగం ఇస్తాం ఓ లింక్‌ పంపించాం. ఆన్‌లైన్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఉంది. అందుకు గాను రూ. 25తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. ఆ లింక్‌ను తెరిచిన ఆమె వివరాలు అందించి పేమెంట్‌ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. ఆ తర్వాత ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అప్పటికే తమ దగ్గర ఉన్న వివరాలతో సైబర్‌ నేరగాళ్లు ఆమె అకౌంట్‌ నుంచి రూ.16,665 దోచుకున్నారు.  

ఇట్లు అద్దెకు తీసుకుంటానని.. 
ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్‌.కామ్‌లో పోస్ట్‌ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. బాలానగర్‌ డివిజన్‌ సాయినగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్‌.కామ్‌లో పోస్టు చేశాడు. అది చూసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి నేను ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు.  ఇంటి అద్దె, అడ్వాన్స్‌ గురించి యజమాని తెలుపగా మొత్తం రూ. 45 వేలు చెల్లిస్తానని గూగుల్‌ పేమెంట్‌ నంబర్‌ నుండి అకౌంట్‌కు వివరాలు పంపాలని చెప్పడంతో బాధితుడి విరాలు పంపగా క్షణల్లో సైబర్‌ నేరగాళ్లు మూడు దఫాల్లో రూ. లక్ష తమ ఖాతల్లోకి మార్చుకున్నారు.  

ఈఎంఐ చెల్లించే క్రమంలో.. 
ఫిరోజ్‌గూడలో నివసించే ఓ వ్యక్తి క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లోన్‌ కట్టేందుకు గూగుల్‌లో వెతుకుతుండగా కస్టమర్‌ కేర్‌ అని కనిపించిన ఓ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. ఈఎంఐ నగదు డెబిట్‌ కాలేదు.. కారణమేంటని ప్రశ్నించగా మీ నగదు జమ కావాలంటే మీ ఫోన్‌లో ఎనీ డెస్క్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి క్రెడిట్‌ కార్డు నెంబర్, ఓటీపీనీ చెప్పాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు చేయడంతో అరగంటలో దాదాపుగా రూ. 15 వేలకు పైగా బాధితుడి ఖాతాలోంచి దోచుకున్నారు.

► బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది మార్చి 24వ తేదీన సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కాగా ఎక్కువగా విద్యావంతులే సైబర్‌ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకున్నారు. అందులో 7 మంది మహిళలు ఉన్నారు.  
సైబర్‌ నేరగాళ్లు రూ. 54. 31 లక్షలు దోచుకోగా అందులో నుంచి రూ. 8.75 లక్షలు రికవరీ చేశారు.  
►  బాధితులు ఎవరైన ఉంటే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి, లేదా 155260 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలన్నారు.  
► సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయిన కొందరైతే.. బంధువులు, స్నేహితులకు తెలిస్తే వారి దగ్గర చులకన అవుతామనే ఆలోచనలతో ఫిర్యాదు చేయడం లేదు.

బ్యాంక్‌ వివరాలు ఇవొద్దు.. 
సైబర్‌ నేరాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన రావాలి. కేవైసీ అప్‌డేట్, బీమా అంటూ రకరకాలుగా సోషల్‌ మీడియాలను వేదికగా చేసుకొని మోసం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరాగాళ్లను ఎదుర్కొంటున్నాం. ఎవ్వరికీ బ్యాంక్‌ వివరాలు ఇవొద్దు. 
బాధితులుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. 

–ఎండీ. వాహిదుద్దీన్, బాలానగర్‌ సీఐ   

చదవండి: ఫారెన్‌ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి

మరిన్ని వార్తలు